కోహ్లిని దాటేశాడు..!

5 Aug, 2019 10:51 IST|Sakshi

లాడర్‌హిల్‌(అమెరికా): టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో నయా రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగాస్కోర్లను అత్యధికంగా సాధించిన జాబితాలో టాప్‌ ప్లేస్‌కి చేరారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లి రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి 20 సార్లు యాభైకి పైగా స్కోర్లను సాధించగా, రోహిత్‌ దాన్ని సవరించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన టీ20లో రోహిత్‌ 67 పరుగులు నమోదు చేశాడు. దాంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 21వ సారి యాభైకి పైగా స్కోరును సాధించాడు. ఫలితంగా కోహ్లిని వెనక్కినెట్టేసి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. రోహిత్‌ యాభైకి పైగా సాధించిన స్కోర్లలో 17 హాఫ్‌ సెంచరీలు ఉండగా, 4 సెంచరీలున్నాయి. (ఇక్కడ చదవండి: రెండో టి20లోనూ టీమిండియా గెలుపు)

ఈ జాబితాలో రోహిత్‌, కోహ్లిల తర్వాత స్థానాలో మార్టిన్‌ గప్టిల్‌(16), క్రిస్‌ గేల్‌(15), బ్రెండన్‌ మెకల్లమ్‌(15)లు ఉన్నారు. కాగా, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ఘనత మాత్రం కోహ్లి పేరిటే ఉంది. కోహ్లి 20 హాఫ్‌ సెంచరీలతో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానంలో రోహిత్‌(17) ఉన్నాడు.అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ (107) రికార్డు సృష్టించాడు. క్రిస్‌ గేల్‌ (విండీస్‌–105) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు.

మరిన్ని వార్తలు