ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం 179

12 Apr, 2019 21:54 IST|Sakshi

కోల్‌కతా:  ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శుభ్‌మన్‌ గిల్‌(65; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తోడుగా ఆండ్రీ రసెల్‌(45; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు.  ఆ తర్వాత రాబిన్‌ ఊతప్ప(28), చివర్లో పీయూష్‌ చావ్లా(14నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. దాంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌ మొదటి బంతికే కేకేఆర్‌ ఓపెనర్‌ జో డెన్లీ బౌల్డ్‌ అయ్యాడు. ఇషాంత్‌ శర్మ వేసిన ఇన్‌ స్వింగర్‌ వికెట్లను గిరాటేసింది. కాగా, ఇది జో డెన్లీకి ఐపీఎల్‌ అరంగేట్రపు మ్యాచ్‌.  తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డక్‌గా డెన్లీ ఔట్‌ కావడంతో చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. డెన్లీ ఔటైన తర్వాత రాబిన్‌ ఊతప్ప-శుభ్‌మన్‌ గిల్‌ జోడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జత చేసిన తర్వాత ఊతప్ప ఔటయ్యాడు. మరో 30 పరుగుల వ్యవధిలో రాణా(11) కూడా ఔట్‌ కావడంతో కేకేఆర్‌ 93 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ఆపై గిల్‌, దినేశ్‌ కార్తీక్‌(2)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో మరోసారి రసెల్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడు. మరోసారి రసెల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసి కేకేఆర్‌ స్కోరును గాడిలో పెట్టాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌, రబడ, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మకు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు