రసెల్‌ రఫ్పాడించాడు..

28 Apr, 2019 21:56 IST|Sakshi

కోల్‌కతా: వరుసగా ఆరు ఓటములతో ఢీలా పడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చావోరేవో మ్యాచ్‌లో పరుగుల వరద పారించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ 233 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభం మొదలుకొని కడవరకూ కేకేఆర్‌ బ్యాట్ప్‌మెన్‌ చెలరేగిపోయారు. శుభ్‌మన్‌ గిల్‌(76; 45బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), క్రిస్‌ లిన్‌(54; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌( 80 నాటౌట్‌; 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు)లు విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడంతో కేకేఆర్‌ భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించింది. శుభ్‌మన్‌ గిల్‌, క్రిస్‌ లిన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ 9.3 ఓవర్లలో 96 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని సాధించి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

ఒకరిపై ఒకరు పోటీ పడి పరుగుల మోత మోగించారు. ఈ క్రమంలో క్రిస్‌ లిన్‌ 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత లిన్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవ లేదు. ఆ దశలో క్రీజ్‌లోకి వచ్చిన ఆండ్రీ రసెల్ ఆరంభంలో కుదురుగా ఆడాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న తర్వాత రసెల్‌ రెచ్చిపోయి ఆడాడు. అతనికి శుభ్‌మన్‌ గిల్‌ను చక్కటి సహకారం లభించింది. ఈ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వీరిద్దరూ 68 పరుగులు జత చేసిన తర్వాత గిల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై రసెల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. బంతిని కొడితే సిక్స్‌ అన్న చందంగా సాగింది రసెల్‌ ఆట. అసలు రసెల్‌కు బంతిని వేయడానికి ముంబై బౌలర్లు బెంబెలెత్తిపోయారు. ప్రధానంగా రసెల్‌ ధాటగా బ్యాటింగ్‌ చేయడంతో​ చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్‌ 75 పరుగులు పిండు కోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇది ఈ సీజన్‌లో అత్యధిక స్కోరుగా నిలిచింది.

మరిన్ని వార్తలు