రుతురాజ్‌ 187 నాటౌట్‌

7 Jun, 2019 04:34 IST|Sakshi
రుతురాజ్‌ గైక్వాడ్‌

శ్రీలంక ‘ఎ’పై భారత్‌ ‘ఎ’ విజయం

బెల్గామ్‌: ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (136 బంతుల్లో 187 నాటౌట్‌; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్‌లోనే గొప్ప ఇన్నింగ్స్‌ ఆడటంతో... శ్రీలంక ‘ఎ’తో గురువారం జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 48 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘ఎ’ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. రుతురాజ్‌ రెండో వికెట్‌కు అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (67 బంతుల్లో 65; 6 ఫోర్లు)తో కలిసి 163 పరుగులు... మూడో వికెట్‌కు ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి 99 పరుగులు జోడించాడు.

అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ 42 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేసి ఓడిపోయింది. షెహాన్‌ జయసూర్య (120 బంతుల్లో 108 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. భారత ‘ఎ’ బౌలర్లలో మయాంక్‌ మార్కండే రెండు వికెట్లు తీసుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. 

మరిన్ని వార్తలు