వ్యక్తిగత చాంప్స్‌ రుత్విక్, సుహాస్‌

6 Jan, 2020 03:50 IST|Sakshi

సౌత్‌జోన్‌ జూనియర్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ జూనియర్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు రుత్విక్‌ రెడ్డి, ఎం. సుహాస్‌ ప్రీతమ్‌ సత్తా చాటారు. గచ్చిబౌలిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో గ్రూప్‌–1 బాలుర వ్యక్తిగత ఈవెంట్‌లో రుత్విక్‌ రెడ్డి, గ్రూప్‌–3 బాలుర కేటగిరీలో సుహాస్‌ ఓవరాల్‌ చాంపియన్‌లుగా నిలిచారు. బాలుర విభాగంలో రుత్విక్, బాలికల విభాగంలో సువన భాస్కర్‌ చెరో 35 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. గ్రూప్‌–3 విభాగంలో సుహాస్‌ ప్రీతమ్, రేణుకాచార్య తలా 26 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌లుగా నిలిచారు. టీమ్‌ విభాగంలో కర్ణాటక 1279 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, తమిళనాడు 611 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీల్లో తెలంగాణ స్విమ్మర్లు 4 రజతాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకున్నారు.

గ్రూప్‌–2 బాలుర 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో బి. సాయి నిహార్‌ (2ని:23.13సె.), గ్రూప్‌–1 బాలుర 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో వై. జశ్వంత్‌ రెడ్డి (2ని:18.68సె.),  100మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో సూర్యాన్షు (1ని:12.32సె.), 400మీ. ఫ్రీస్టయిల్‌లో సీహెచ్‌ అభిలాశ్‌ (4ని:26.12సె.) తలా ఓ రజతాన్ని సాధించారు. జాహ్నవి గోలి గ్రూప్‌–1 బాలికల 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ను 2నిమిషాల 43.36 సెకన్లలో పూర్తిచేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్లు 2 పతకాల్ని సాధించారు. గ్రూప్‌–4 బాలుర 100మీ. ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో ఎం. యజ్ఞసాయి (1ని:7.08సె.), గ్రూప్‌–2 బాలికల 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో వి. నాగ గ్రీషి్మణి (1ని:25.41సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హోప్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కొండా విజయ్‌ కుమార్, నార్సింగి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

మరిన్ని వార్తలు