ధోని, ద్రవిడ్‌లపై శ్రీశాంత్‌ అసహనం..

6 Nov, 2017 20:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాదస్పద క్రికెటర్‌, నిషేదిత బౌలర్‌ శ్రీశాంత్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌లపై అసహనం వ్యక్తం చేశాడు. రిపబ్లిక్‌ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్‌కు తెలియజేశానని, కానీ అతను నాకు మద్దతివ్వక పోవడంతో చాల బాధ పడ్డానని తెలిపాడు. ఇక ఎంఎస్‌ ధోనికి ఎమోషనల్‌గా మెసేజ్‌ చేశానని..కానీ అతను కూడా స్పందించలేదని శ్రీశాంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో ఆరుగురు నుంచి 10 మంది టాప్‌ ప్లేయర్లకు ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని ఆరోపించాడు. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించిందని తెలిపాడు. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు కూడా నమోదు చేసిన విషయం అందరికీ తెలుసిందేనని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని' శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. 

నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది. కానీ ఐసీసీ కాదుగా' అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల శ్రీశాంత్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్‌ చేసింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో దొరికిపోయిన పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది.

2013 జూలైలో ఐపీఎల్‌-6 సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. ఇక క్రికెట్‌ ఆడటం నా హక్కు. ఆ హక్కు కోసం నేను సుప్రీం కోర్టులో పోరాడతా అని శ్రీశాంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు