ఇప్పుడు అతడేంటో నిరూపించుకోవాలి: సచిన్‌

17 Jun, 2019 21:50 IST|Sakshi

మాంచెస్టర్‌ : ఆటగాళ్ల గాయాలు టీమిండియాను కలవరపెడుతోంది. ఇప్పటికే డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయంతో సతమతమవుతుండగా.. తాజాగా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొడ కండరాలు పట్టేయడంతో రానున్న రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అయితే ప్రపంచకప్‌లో ఇద్దరు స్పెషలిస్టు బౌలర్లతోనే బరిలోకి దిగాలనే టీమ్‌ వ్యూహంతో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భువీ దూరం కావడంతో అఫ్గానిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో షమీ జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే షమీ జట్టులోకి రానుండటంపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.
‘షమీ వచ్చే మ్యాచ్‌లో ఆడితే ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందులే. అతడు అత్యంత ప్రతిభావంతుడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. షమీ బౌలింగ్‌ రన్నప్‌ నాకు ఎంతో ఇష్టం. ఇప్పటికే షమీ తన బౌలింగ్‌తో గత ప్రపంచకప్‌లో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో అవకాశం వస్తే అతడేంటో నిరూపించుకోవాలి. ధావన్‌ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ పర్వాలేదనిపించాడు. పాక్‌పై టీమిండియా సమిష్టిగా ఆడి విజయం సాధించింది’అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా జూన్‌ 22న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు