‘అండర్సన్‌ తల పగులగొట్టాలనుకున్నా’

14 Apr, 2020 16:52 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయీద్‌ అజ్మల్‌ 

‘‘ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కొత్త బంతిని తీసుకున్నపుడు.. అండర్సన్‌ నా దగ్గరకు వచ్చాడు. బౌన్సర్లు ఎదుర్కొనేందుకు సిద్ధమేనా అని అడిగాడు. నాకు ఇంగ్లిష్‌ రాదని తనకు చెప్పాను. బహుషా నేను టెయిలెండర్‌ అయినందు వల్లే అతడలా జోక్‌ చేసి ఉంటాడు. నన్ను త్వరగా ఔట్‌ చేయాలని భావించి ఉంటాడు అంటూ ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ టెస్టు​ క్రికెట్‌ మ్యాచ్‌ నాటి సంగతులను పాక్‌ మాజీ క్రికెటర్‌ సయీద్‌ అజ్మల్‌ గుర్తుచేసుకున్నాడు. క్రికెట్‌ పాకిస్తాన్‌తో మాట్లాడిన అతడు.. 2010లో బర్మింగ్‌హాంలో జరిగిన సెకండ్‌ టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు తనను టార్గెట్‌ చేశారని చెప్పుకొచ్చాడు.(కరోనాతో మాజీ క్రికెటర్‌ మృతి)

ఇక ఆనాటి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసి సత్తా చాటిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ మాట్లాడుతూ... ‘‘ బౌన్సర్లు సంధించి నన్ను పరీక్షించారు. ఆరేడు బంతుల తర్వాత... జుల్కర్నైన్‌ను పిలిచి అండర్సన్‌ తలను నా బ్యాట్‌తో పగులగొట్టేస్తానని చెప్పాను. క్రీజు వదిలి ముందుకొచ్చి రెండు బౌన్సర్లు బాదేశాను. ఇక అప్పటి నుంచి బంతి నా బ్యాట్‌ మీదకు రావడం మొదలెట్టింది. అలా 50 పరుగులు పూర్తి చేశా’’అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ కేవలం 72 పరుగులే చేసి కుప్పకూలగా.. ఇంగ్లండ్‌ 251 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా రాణించిన పాకిస్తాన్‌ 296 పరుగులు సాధించి చెప్పుకోదగ్గ స్కోరు చేయగా... ప్రత్యర్థి జట్టు కేవలం ఒకే ఒక వికెట్‌ కోల్పోయి పాక్‌ను మట్టికరిపించింది. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌ గ్రేమ్‌ స్వాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది.('టిమ్‌ పైన్‌ ఉత్తమ కెప్టెన్‌గా నిలుస్తాడు')

మరిన్ని వార్తలు