సాహా మళ్లీ మెరిపించాడు..

20 Oct, 2019 15:42 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో తన మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా తన వికెట్‌ కీపింగ్‌తో మెరిపించాడు. భారత్‌ తన ఇన్నింగ్స్‌ను 497/9 వద్ద డిక్లేర్డ్‌ చేసిన తర్వాత ఇన్నింగ్స్‌కు దిగిన సఫారీలకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు డీన్‌ ఎల్గర్‌, డీకాక్‌లు విఫలమయ్యారు.  తొలి వికెట్‌గా ఎల్గర్‌ డకౌట్‌గా నిష్క్రమించితే, రెండో వికెట్‌గా డీకాక్‌ ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో భాగంగా మహ్మద్‌ షమీ వేసిన రెండో బంతి బౌన్స్‌ అవుతూ ఎల్గర్‌పైకి దూసుకొచ్చింది. దాన్ని ఆడటానికి తడబడంతో అది కాస్త ఎల్గర్‌ గ్లౌవ్‌ను ముద్దాడుతూ సాహా చేతుల్లోకి వెళ్లింది.

ఎత్తులో వచ్చిన బంతిని సాహా అద్భుతమైన రీతిలో అందుకోవడంతో ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆపై డీకాక్‌ను ఉమేశ్‌ దాదాపు అదే బంతితో పెవిలియన్‌కు పంపించాడు. రెండో ఓవర్‌ చివరి బంతిని ఉమేశ్‌ లెగ్‌స్టంప్‌పై బౌన్స్‌ చేయగా డీకాక్‌ ఇబ్బంది పడ్డాడు. అది కూడా గ్లౌవ్‌ను తాకుతూ వెళుతున్న క్రమంలో అమాంతం ఎగిరిన సాహా దాన్ని క్యాచ్‌గా పట్టుకున్నాడు. దాంతో సఫారీలు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. అయితే సఫారీలు మరో పరుగు జోడించిన తర్వాత వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు.  ప్రస్తుతం సఫారీలు 488 పరుగులు వెనుకబడ్డారు.

మరిన్ని వార్తలు