చాంపియన్‌ సహజశ్రీ

28 May, 2019 10:04 IST|Sakshi

ఫిడే రేటింగ్‌ మహిళల చెస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: మీనాతాయి షిర్గావ్‌కర్‌ స్మారక ఇంటర్నేషనల్‌ ఫిడే రేటింగ్‌ మహిళల చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని సంగ్లి వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో సహజశ్రీ నిర్ణీత 8 రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకుంది. ఆరు గేముల్లో గెలిచిన సహజ... రెండింటినీ డ్రా చేసుకొని అజేయంగా నిలిచింది.

తొలి గేమ్‌లో భక్తి రజాయ్‌ (గుజరాత్‌)పై, రెండో గేమ్‌లో అస్మితా (గోవా)పై, మూడో గేమ్‌లో డే కేయా (గుజరాత్‌)పై, నాలుగో గేమ్‌లో మోహిత (ఏపీ)పై, ఐదో గేమ్‌లో వృషాలి (మహారాష్ట్ర)పై గెలుపొందిన సహజశ్రీ... విశ్వ షా (మహారాష్ట్ర)తో ఆరోగేమ్‌ను, ధనశ్రీ (మహారాష్ట్ర)తో ఏడో గేమ్‌ను డ్రా చేసుకుంది. చివరిదైన ఎనిమిదో రౌండ్‌లో రియా నరేంద్ర (మహారాష్ట్ర)పై గెలుపొంది చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన విశ్వ షా, వృషాలి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.   

మరిన్ని వార్తలు