సాయి అభినయ్‌ విజృంభణ

7 Jul, 2018 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో కొసరాజు సీసీ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. పి. సాయి అభినయ్‌ (5/31) బౌలింగ్‌లో విజృంభించడంతో డీఎంఆర్‌సీ–2 మైదానంలో వీనస్‌ సైబర్‌టెక్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 263 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్‌ స్కోరు 10/4తో రెండోరోజు శుక్రవారం ఆట కొనసాగించిన వీనస్‌ జట్టు అభినయ్‌ ధాటికి 36.3 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. శుభమ్‌ శివాజీ చవాన్‌ (33; 6 ఫోర్లు) మినహా బ్యాటింగ్‌లో ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. ఇందులో నలుగురు అభినయ్‌ బౌలింగ్‌లోనే డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. అంతకుముందు కొసరాజు సీసీ 348 పరుగులకు ఆలౌటైంది.

డెక్కన్‌ వాండరర్స్‌ గెలుపు

టీమ్‌ స్పీడ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో డెక్కన్‌ వాండరర్స్‌ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టీమ్‌ స్పీడ్‌ 217 పరుగులకు ఆలౌటవ్వగా... వాండరర్స్‌ 68.1 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసి గెలుపొందింది. గ్రీన్‌టర్ఫ్‌తో మాంచెస్టర్, ఎలిగెంట్‌తో మహమూద్‌ సీసీ, బాలాజీ కోల్ట్స్‌తో జై భగవతి, కాన్‌కర్డ్‌తో హెచ్‌యూసీసీ, గెలాక్సీతో మెగా సిటీ జట్ల మధ్య రెండో రోజు జరగాల్సిన ఆట వర్షం కారణంగా రద్దయింది. దీంతో మ్యాచ్‌ ఫలితాన్ని డ్రాగా నిర్ణయించారు.
 
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

రాకేశ్‌ ఎలెవన్‌: 259/9 (సచిత్‌ నాయుడు 150, రాఘవ 51), చీర్‌ఫుల్‌ చమ్స్‌: 25/0 (6 ఓవర్లలో).  
హెచ్‌బీసీసీ: 178 (మొహమ్మద్‌ హుస్సేన్‌ 70; అబ్దుల్‌ అద్నాన్‌ 5/41), శ్రీ శ్యామ్‌: 87/3 (ప్రణీత్‌37, ఇబ్రహీం సిద్ధిఖీ 33).
క్రౌన్‌ సీసీ: 247 (అభిషేక్‌ 52, సందేశ్‌ 67, దినేశ్‌ 61; వెంకట్‌ 4/72), జిందా తిలిస్మాత్‌: 249/8 (సాయి వ్రత్‌ 121, షబార్‌ 48; దినేశ్‌ 4/73).

మరిన్ని వార్తలు