సాయిప్రణీత్‌ విరాళం రూ. 4 లక్షలు

9 Apr, 2020 05:59 IST|Sakshi
సాయిప్రణీత్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్‌... ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు... తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్‌ క్రీడాంశం నుంచి చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్‌ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు.  
హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా... తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది.  

చెస్‌ క్రీడాకారుల దాతృత్వం
కోవిడ్‌–19పై పోరాటానికి చెస్‌ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్‌లైన్‌ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్‌ కోచ్‌ ఆర్‌బీ రమేశ్‌కు చెందిన చారిటబుల్‌ ట్రస్ట్‌ ‘చెస్‌ గురుకుల్‌’కు ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్‌ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు.

మరిన్ని వార్తలు