శ్రమించి... శుభారంభం

20 Aug, 2019 04:39 IST|Sakshi

తొలి రౌండ్‌లో గట్టెక్కిన శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణ తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు తొలి రౌండ్‌ అడ్డంకిని శ్రమించి అధిగమించారు. శ్రీకాంత్, ప్రణయ్‌ ఒక్కో గేమ్‌ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్‌ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
   
బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): తమకంటే తక్కువ ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్లను ఓడించడానికి భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకదశలో ఊహించని ఫలితం వస్తుందేమోననే అనుమానం కలిగినా... సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత పదో ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్‌ భమిడిపాటి సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఈ మెగా ఈవెంట్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్‌ ఎన్‌హట్‌ ఎన్గుయెన్‌ (ఐర్లాండ్‌)పై... సాయిప్రణీత్‌ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్‌ జేసన్‌ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్‌ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్‌ ఈటూ హీనో (ఫిన్‌లాండ్‌)పై విజయం సాధించారు.  

గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌లోనూ ఎన్‌హట్‌ ఎన్గుయెన్‌తోనే ఆడిన శ్రీకాంత్‌ నాడు రెండు గేముల్లో గెలుపొందగా... ఈసారి మాత్రం మూడు గేముల్లో గట్టెక్కాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్‌ రెండో గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17–16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తొలి పాయింట్‌ నుంచే దూకుడుగా ఆడాలని శ్రీకాంత్‌కు సూచించాడు. తొలి పాయింట్‌ కోల్పోయాక... శ్రీకాంత్‌ తన జోరు పెంచాడు. స్మాష్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.  

డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌), చైనా దిగ్గజం లిన్‌ డాన్, నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్‌ ఆంథోని జిన్‌టింగ్‌ (ఇండోనేసియా), ఐదో సీడ్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌), మూడో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.  మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన–పూర్వీషా (భారత్‌) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్‌ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది.   

మరిన్ని వార్తలు