సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

26 Jul, 2019 11:01 IST|Sakshi

టోక్యో: భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు సాయి ప్రణీత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాయి ప్రణీత్‌ 21-12, 21-15 తేడాతో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా  జపాన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సాయి ప్రణీత్‌.. రెండో గేమ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. ఓ దశలో సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా సాయి ప్రణీత్‌ ఎక్కడ తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. కేవలం 36 నిమిష్లాలోనే సుగియార్తోను మట్టికరిపించాడు సాయి ప్రణీత్‌. ఈ ఏడాది సాయి ప్రణీత్‌కు ఇది రెండో సెమీ ఫైనల్‌. అంతకుముందు స్విస్‌ ఓపెన్‌లో సాయిప్రణీత్‌ ఫైనల్‌కు వరకూ చేరాడు.

>
మరిన్ని వార్తలు