సాయివిష్ణు జోడీకి టైటిల్‌ 

17 Jan, 2020 14:15 IST|Sakshi

ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు పుల్లెల సాయివిష్ణు సత్తా చాటాడు. చండీగఢ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి పీఎస్‌ రవికృష్ణ (కేరళ)తో కలిసి డబుల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన అండర్‌–19 బాలుర డబుల్స్‌ ఫైనల్లో సాయివిష్ణు (తెలంగాణ)–రవికృష్ణ (కేరళ) ద్వయం 18–21, 21–18, 21–16తో గిరీశ్‌ నాయుడు(ఎయిరిండియా)–శంకర్‌ప్రసాద్‌ ఉదయ్‌ కుమార్‌ (కేరళ) జోడీపై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో సాయివిష్ణు–రవికృష్ణ ద్వయం 21–17, 21–19తో ఆయుశ్‌ అగర్వాల్‌–తుషార్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)జంటపై, క్వార్టర్స్‌లో 19–21, 21–15, 21–13తో రెండోసీడ్‌ వెంకట హర్ష వర్ధన్‌ (ఆంధ్రప్రదేశ్‌)–అరవింద్‌ సురేశ్‌ (కేరళ) జోడీపై, రెండోరౌండ్‌లో 21–11, 21–16తో కౌశిక్‌ (తమిళనాడు)–శ్రీకర్‌ (తెలంగాణ) జంటపై, తొలిరౌండ్‌లో 21–19, 21–14తో ఆర్యన్‌ హుడా–పంకజ్‌ (హరియాణా) జంటపై గెలుపొందారు. 

బాలికల డబుల్స్‌ విభాగంలో రెండోసీడ్‌ అదితి భట్‌ (ఉత్తరాఖండ్‌)–తాన్య హేమంత్‌ (కర్ణాటక) జోడీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఈ జంట 21–11, 21–9తో ఆరోసీడ్‌ శ్రుతి మిశ్రా–శైలజా శుక్లా (ఉత్తర్‌ప్రదేశ్‌) జోడీని ఓడించింది. ఈ కేటగిరీలో వైష్ణవి–కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంట క్వార్టర్స్‌లో, కె. భార్గవి–సాయి శ్రీయ (తెలంగాణ) జోడీలు తొలిరౌండ్‌లో ఓటమి పాలయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌పోరులో  టాప్‌ సీడ్‌ ఎడ్విన్‌ జాయ్‌ (కేరళ)–శ్రుతి మిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌) జోడీ 21–18, 21–14తో నాలుగోసీడ్‌ అరవింద్‌ సురేశ్‌ (కేరళ)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. బాలికల సింగిల్స్‌ విభాగంలో మూడోసీడ్‌ మాన్సిసింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), బాలుర సింగిల్స్‌ కేటగిరీలో రెండోసీడ్‌ రవి (హరియాణా) చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు