రెండో రోజూ మోహిత్‌ సైనీ జోరు

6 Jul, 2018 10:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్, సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్, ఏజిస్‌ ఆఫ్‌ లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోన్న సీని యర్‌ మల్టీ క్లాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో రోజు మోహిత్‌ సైనీ జోరు కనబర్చాడు. లేజర్‌ స్టాండర్డ్‌ విభాగంలో బరిలో దిగిన అతను గురువారం జరిగిన మూడు రేసుల్లో రెండింట్లో అగ్రస్థానంలో నిలిచాడు.

మరో రేసులో ఉపమన్యు దత్తా తొలి స్థానం దక్కించుకున్నాడు. ఫిన్‌ క్లాస్‌ విభాగంలో నిర్వహించిన మూడు రేసులూ పోటాపోటీగా సాగా యి. తొలి రౌండ్‌లో స్వతంత్ర సింగ్, రెండో రౌండ్‌లో గుర్జీత్‌ సింగ్, మూడో రౌండ్‌లో నవీన్‌ అగ్రస్థానాలు దక్కించుకున్నారు. ముగ్గురు సెయిలర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. రెండో రోజు కూడా వాతావరణం సహకరించకపోవడంతో సెయిలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతంలో గంటకు 20కి.మీ. వేగంతో గాలి వీస్తుండటంతో దాన్ని తట్టుకుంటూ ముందుకు సాగడం సెయిలర్లకు కష్టసాధ్యమైంది.

మరిన్ని వార్తలు