క్వార్టర్స్‌లో సైనా

3 Jun, 2016 00:44 IST|Sakshi
క్వార్టర్స్‌లో సైనా

జ్వాల జోడికి చుక్కెదురు  ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్

జకర్తా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్... ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సైనా 21-11, 21-10తో ప్రపంచ 53వ ర్యాంకర్ ఫిట్రేని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టింది. తొలి గేమ్‌లో 9-7 ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 14-7తో నిలిచింది. ఆ తర్వాత కూడా అదే జోరుతో గేమ్‌ను చేజిక్కించుకుంది.

ఇక రెండో గేమ్‌లోనూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 10-3 ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత ఫిట్రేని ఒకటి, రెండు పాయింట్లు నెగ్గినా... హైదరాబాద్ అమ్మాయి దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో జ్వాల-అశ్విని జోడి 9-21, 18-21తో హుయాంగ్ యోక్వియాంగ్-టాంగ్ జినుహా (చైనా) చేతిలో పరాజయం పొందారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 18-21, 13-21తో ఆరోసీడ్ కో సుంగ్ యున్-షిన్ బీక్ చియోల్ (కొరియా) చేతిలో ఓడారు.

మరిన్ని వార్తలు