సింధుపై సైనాదే పైచేయి 

27 Jan, 2018 01:38 IST|Sakshi

జకార్తా: ఇద్దరు భారత మేటి క్రీడాకారిణుల మధ్య జరిగిన సమరంలో అనుభవజ్ఞురాలినే విజయం వరించింది. ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భాగంగా ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధుతో జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సైనా నెహ్వాల్‌ గెలిచి సెమీస్‌కు చేరింది. 37 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా 21–13, 21–19తో సింధును ఓడించింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సైనా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 8–5తో ఆధిక్యంలో ఉంది.   

సాత్విక్‌ జంట సంచలనం 
పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 23–21, 15–21, 21–19తో నాలుగో సీడ్, ప్రపంచ ఆరో ర్యాంక్‌ జోడీ మాడ్స్‌ పీటర్సన్‌–మాడ్స్‌ కోల్డింగ్‌ (డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగే సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ గిడియోన్‌–సుకముల్జో (ఇండోనేసియా) జంటతో సాత్విక్‌–చిరాగ్‌ జంట ఆడుతుంది.   

మరిన్ని వార్తలు