సైనా నెహ్వాల్‌ ప్రతీకార విజయం

9 Jan, 2020 12:48 IST|Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రి క్వార్టర్స్‌లో సైనా 25-23, 21-12 తేడాతో వరల్డ్‌ తొమ్మిదో ర్యాంకర్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరారు. రెండు వరుస గేమ్‌ల్లో సైనా విజయం సాధించి క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఇరువురి మధ్య తొలి గేమ్‌ హోరీ హోరీగా సాగింది. తొలి గేమ్‌లో సైనా ఐదు పాయింట్లతో ఆధిక్యంలో నిలవగా, ఆపై ఆన్‌ సెంగ్‌ పుంజుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి స్కోరు 23-23గా సమంగా నిలిచింది.

ఆపై సైనా వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‌ ఏకపక్షంగా జరిగింది. ఆన్‌ సె యంగ్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధిస్తూ సైనా దూసుకుపోయారు. ఫలితంగా 10 పాయింట్ల తేడాతో ఆన్‌ సె  యంగ్‌పై పైచేయి సాధించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నారు. ఆన్‌ సె యంగ్‌పై సైనాకు ఇది తొలి విజయం. గతేడాది జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనాపై ఆన్‌ సె యంగ్‌ విజయం సాధించారు. తాజా గెలుపుతో దానికి సైనా ప్రతీకారం తీర్చుకున్నారు. తదుపరి గేమ్‌లో స్పెయిన్‌ స్టార్‌ కరోలినా మార్టిన్‌తో సైనా తలపడనున్నారు.

మరిన్ని వార్తలు