సైనా నెహ్వాల్కు నిరాశ

3 Jun, 2016 15:12 IST|Sakshi

జకర్తా:ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా  22-24, 11-21 తేడాతో  వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్(స్పెయిన్)చేతిలో ఓటమి పాలైంది.  తొలి గేమ్ లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్ లో తీవ్ర ఒత్తిడికి లోనై పరాజయం చెందింది.

 

తొలి గేమ్ ఆదిలో మారిన్ 11-7 తేడాతో  ఆధిక్యం సాధించి ముందుకు దూసుకుపోయింది. అయితే ఆ తరువాత పుంజుకున్న సైనా 14-14 తో స్కోరును సమం చేసింది.  ఇదే క్రమంలో సైనా 16-14, 19-18తో ఆధిక్యం సాధించి తొలి గేమ్ ను గెలుచుకునే దిశగా సాగింది. కాగా, స్కోరు 20-20 వద్ద ఉండగా ముందంజ వేసిన మారిన్ తొలి గేమ్ ను కైవసం చేసుకుంది. ఇక  రెండో గేమ్ లో సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం పైచేయి సాధించిన మారిన్ ఆ గేమ్ ను దక్కించుకుని సెమీస్ లో కి ప్రవేశించింది. కరోలినా తన తదుపరి సెమీస్ పోరులో వాంగ్ యిహాన్ తో తలపడుతుంది.
 

మరిన్ని వార్తలు