సైనా సాధించేనా? 

30 Apr, 2019 00:48 IST|Sakshi

నేటి నుంచి న్యూజిలాండ్‌ ఓపెన్‌

ఆక్లాండ్‌: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ న్యూజిలాండ్‌ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి ఈ సీజన్‌లో మరో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలో దిగుతోంది. తొలి రోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్‌ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వాంగ్‌ జియి (చైనా)తో సైనా ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారమైతే సైనా తన స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్‌ చేరుకునే అవకాశముంది.

మరో పార్శ్వంలో టాప్‌ సీడ్, ఆసియా చాంపియన్‌ అకానె యామగుచి (జపాన్‌) తుది పోరుకు చేరుకునే చాన్స్‌ ఉంది. ఈ ఏడాది భారత్‌ నుంచి సైనా నెహ్వాల్‌ మాత్రమే అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. ఆమె ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌   క్వాలిఫయింగ్‌లో అజయ్‌ జయరామ్, లక్ష్య సేన్, పారుపల్లి కశ్యప్‌ బరిలో ఉన్నారు. మెయిన్‌ ‘డ్రా’లో హెచ్‌ఎస్‌ ప్రణయ్, సాయిప్రణీత్, శుభాంకర్‌ డేలకు చోటు లభించింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్‌ రెడ్డి జోడీ... మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంటలు పోటీపడనున్నాయి.    

>
మరిన్ని వార్తలు