సైనా ముందడుగు వేసేనా!

29 Oct, 2019 09:57 IST|Sakshi

సార్లోర్‌లక్స్‌ ఓపెన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఈ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత వెటరన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహా్వల్‌ సార్లోర్‌లక్స్‌ ఓపెన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. జర్మనీలోని సార్‌బ్రకెన్‌ నగరంలో నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో హైదరాబాదీ సీనియర్‌ స్టార్‌ టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమె జర్మనీకి చెందిన ఫాబియెన్నె డిప్రెజ్‌తో తలపడుతుంది. జనవరిలో ఇండోనేసియా మాస్టర్స్‌ టైటిల్‌ నెగ్గిన సైనా... తర్వాత వరుస వైఫల్యాలతో నిరాశపరిచింది. ఏకంగా మూడు టోర్నీల్లో తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్యసేన్‌కు ఎనిమిదో సీడ్‌ దక్కింది.

ఈ సీజన్‌లో బెల్జియన్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్, డచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన ఈ భారత ఆటగాడు మూడో టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. తొలిరౌండ్లో అతనికి బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్లో లక్ష్యసేన్‌ రాకెట్‌ పట్టనున్నాడు. ఈతు హీనో (ఫిన్లాండ్‌), ఎలియస్‌ బ్రాకే (బెల్జియం)ల మధ్య జరిగే తొలిరౌండ్‌ మ్యాచ్‌ విజేతతో లక్ష్యసేన్‌ రెండోరౌండ్లో తలపడతాడు. వీళ్లిద్దరితో పాటు ఈ టోర్నీలో కిరణ్‌ జార్జ్, మిథున్‌ మంజునాథ్, రాహుల్‌ భరద్వాజ్‌ పాల్గొంటున్నారు. 

మరిన్ని వార్తలు