కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సైనా 21–12, 21–16తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. సమీర్ 13–21, 15–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్లో భారత్కు నిరాశే మిగిలింది.
తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 16–21, 12–21తో నాలుగో సీడ్ జెంగ్ సివె–హువాంగ్ యాకియోంగ్ (చైనా) ద్వయం చేతిలో... రోహన్ కపూర్–కుహూ గార్గ్ (భారత్) జోడీ 9–21, 10–21తో హి జిటింగ్–డు యు (చైనా) జంట చేతిలో ఓడిపోయాయి.