సైనా, శ్రీకాంత్‌ శుభారంభం

20 Feb, 2020 06:31 IST|Sakshi

బార్సిలోనా (స్పెయిన్‌): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌... బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 21–16, 21–14తో వైవోని లి (జర్మనీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 23–21, 21–18తో శుభాంకర్‌ డే (భారత్‌)ను ఓడించాడు. పురుషుల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 18–21, 15–21తో డారెన్‌ లియు (మలేసియా) చేతిలో ఓడిపోగా... వైగోర్‌ కోల్హో (బ్రెజిల్‌)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్‌ మూడో గేమ్‌లో  12–14 స్కోరు వద్ద గాయంతో వైదొలిగాడు. జయరామ్‌ 21–14, 21–12తో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) పై, సమీర్‌ వర్మ 21–12, 21–9తో క్లియర్‌బౌట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 10–21, 21–16, 21–17తో క్రిస్టియాన్సెన్‌–బోయె (డెన్మార్క్‌) జోడీపై గెలిచింది.  

మరిన్ని వార్తలు