సాకేత్ జంటకు డబుల్స్ టైటిల్

27 Sep, 2015 01:45 IST|Sakshi
సాకేత్ జంటకు డబుల్స్ టైటిల్

సాక్షి, హైదరాబాద్: ఇజ్మీర్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి దివిజ్ శరణ్‌తో కలిసి సాకేత్ విజేతగా నిలిచాడు. టర్కీలోని ఇజ్మీర్ పట్టణంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-దివిజ్ శరణ్ ద్వయం 7-6 (7/5), 4-6, 9-8తో ఆధిక్యంలో ఉన్న దశలో నాలుగో సీడ్, ప్రత్యర్థి జంట మాలిక్ జజిరి (టర్కీ)-మొల్చనోవ్ (ఉక్రెయిన్) గాయం కారణంగా వైదొలిగింది. విజేతగా నిలిచిన సాకేత్ జోడీకి 3,950 యూరోల (రూ. 2 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్‌లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గతంలో అతను సనమ్ సింగ్‌తో కలిసి పుణే, ఢిల్లీ, కోల్‌కతాలలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లలో డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు.

>
మరిన్ని వార్తలు