టైటిల్ పోరుకు సాకేత్ జోడీ

21 Mar, 2015 01:05 IST|Sakshi

చైనా ఏటీపీ చాలెంజర్ టోర్నీ
షెన్‌జెన్ (చైనా): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కొత్త భాగస్వామి దివిజ్ శరణ్ (భారత్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-దివిజ్ ద్వయం 2-6, 7-6 (7/2), 10-5తో మావో జిన్ గాంగ్ (చైనా)-సియెన్ యిన్ పాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది.

గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జోడీ రెండు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి గేమ్‌లో తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన భారత క్రీడాకారులు రెండో గేమ్‌లో రాణించారు. తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని కీలకమైన టైబ్రేక్‌లో రాణించి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో భారత జోడీ పైచేయి సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ గెరో క్రెట్‌షెమర్-అలెగ్జాండర్ సాట్శెకో (జర్మనీ)లతో సాకేత్-దివిజ్ తలపడతారు.

>
మరిన్ని వార్తలు