సాక్షి, వినేశ్‌ కూడా అవుట్‌

25 Aug, 2017 01:02 IST|Sakshi

పారిస్‌: ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ (60 కేజీలు), వినేశ్‌ ఫోగట్‌ (48 కేజీలు) కూడా ఈ మెగా ఈవెంట్‌లో ఆకట్టుకోలేకపోయారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ బౌట్‌లలో సాక్షి 1–3తో ల్యూసా నైమెష్‌ (జర్మనీ) చేతిలో పరాజయం పాలవ్వగా, వినేశ్‌పై విక్టోరియా ఆంథోని (అమెరికా)పైచేయి సాధించింది.

వీరితో పాటు శీతల్‌ తోమర్‌ (53 కేజీలు), నవ్‌జ్యోత్‌ కౌర్‌ (69 కేజీలు) కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన శీతల్‌ ప్రిక్వార్టర్స్‌లో 10–0తో గెలుపొంది, క్వార్టర్స్‌లో 2–4తో ఎస్టేరా డోబ్రే (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. నవ్‌జ్యోత్‌ కౌర్‌ 5–10తో ఆకిర్బాట్‌ నసన్‌బుర్మా (మంగోలియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఇక భారత్‌ పతక ఆశలన్నీ ఆసియన్‌ చాంపియన్‌ బజ్‌రంగ్‌ పూనియా (65కేజీలు), ఒలింపియన్‌ సందీప్‌ తోమర్‌ (57 కేజీలు)లపైనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు