ముంబై రాకెట్స్‌ దూకుడు

1 Jan, 2019 02:21 IST|Sakshi

5–2తో అవధ్‌ వారియర్స్‌పై ఘన విజయం  

పుణే: ఉత్కంఠగా సాగిన పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ముంబై రాకెట్స్‌ 5–2తో అవధ్‌ వారియర్స్‌పై గెలిచింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌లో తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లనే ‘ట్రంప్‌’గా ఎంచుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో బీవెన్‌ జాంగ్‌ (అవధ్‌) 15–10, 15–10 తేడాతో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై నెగ్గి జట్టును 2–0 ఆధిక్యంలో నిలిపింది. అనంతరం పురుషుల డబుల్స్‌ను ముంబై ‘ట్రంప్‌’గా ఎంచుకుంది. లియాంగ్‌ డె–కిమ్‌ జి జంగ్‌ జోడీ 15–7, 15–9తో లి చాంగ్‌ వి–ఎంఆర్‌ అర్జున్‌ జంటపై గెలుపొందింది. స్కోర్లు 2–2తో సమంగా నిలిచిన ఈ స్థితిలో పురుషుల సింగిల్స్‌ హోరాహోరీగా సాగాయి.

తొలి మ్యాచ్‌లో ఆండర్స్‌ ఆంటోన్సెన్‌ (ముంబై) 6–15, 15–11, 15–14తో సన్‌ వాన్‌ హోపై, రెండో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ (ముంబై) 15–11, 8–15, 15–11తో లీ డాంగ్‌ కుయెన్‌పై శ్రమించి నెగ్గారు. దీంతో 4–2తో ఫలితం తేలిపోయింది. నామమాత్రంగా మారిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ ముంబై పట్టు విడవలేదు. కిమ్‌ జి జంగ్‌–పియా బెర్నాడెత్‌ జంట 15–10, 7–15, 15–13తో అశ్విని పొన్నప్ప–మథియాస్‌ క్రిస్టియన్‌సెన్‌లపై జయభేరి మోగించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌తో నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ తలపడుతుంది.  

మరిన్ని వార్తలు