నేను పాక్‌ డైటీషియన్‌ను కాదు: సానియా

19 Jun, 2019 05:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ చేతిలో పరాభవం తర్వాత పాక్‌ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో అటు అభిమానులు, ఇటు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శల తాకిడి షోయబ్‌ మాలిక్‌ భార్య, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను తాకాయి. నైట్‌ క్లబ్‌లో షోయబ్‌ సహా పలువురు క్రికెటర్లతో ఆమె డైనింగ్‌ టేబుల్‌ పంచుకున్న ఫొటోపై పాకిస్తాన్‌ నటి వీణా మాలిక్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘మీ అబ్బాయిని కూడా తీసుకెళ్లావా? జాగ్రత్త... జంక్‌ ఫుడ్‌ ఆటగాళ్లకు మంచిదికాదన్న సంగతి ప్లేయర్‌వైన నీకు తెలియదా’ అని సానియాను దెప్పిపొడుస్తూ వీణా మాలిక్‌ ట్వీట్‌ చేసింది. దీనికి టెన్నిస్‌ స్టార్‌ స్పందించింది. ‘వీణా... నేను నా కుమారుణ్ని అక్కడికి తీసుకెళ్లలేదు.

వాడినెలా చూసుకోవాలో నీకంటే, అందరికంటే నాకే బాగా తెలుసు. ఇకపోతే నేనేమీ పాక్‌ జట్టు డైటీషియన్‌ను (పోషకాహార నిపుణులు) కాదు. ప్రిన్సిపాల్‌నో, టీచర్‌నో అంతకంటే కాదు. నీ స్థానంలో నేను ఉండి ఉంటే మ్యాగజిన్‌ కవర్‌పై ప్రచురితమైన నీ అశ్లీల చిత్రాలు నీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో అనే విషయం గురించి ఆలోచించేదాన్ని’ అని ట్వీట్‌ చేసింది. ఈ వ్యవహారంపై సానియా భర్త షోయబ్‌ నిర్వేదం చెందాడు. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శించడం తగదని హితవు పలికాడు. ‘మేం మ్యాచ్‌ ముందురోజు క్లబ్‌కు వెళ్లలేదు. రెండ్రోజుల ముందు వెళ్లిన ఫొటో అది. దాన్ని పట్టుకొని నిందించడమేంటి. 20 ఏళ్లుగా పాక్‌ క్రికెట్‌కు సేవలందించిన నన్ను ఇలా అవమానిస్తే ఎలా’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

>
మరిన్ని వార్తలు