సానియా, హింగిస్ విడిపోయారు

10 Aug, 2016 03:03 IST|Sakshi
సానియా, హింగిస్ విడిపోయారు

భాగస్వాములను మార్చుకున్న టెన్నిస్ స్టార్స్
న్యూఢిల్లీ: గతేడాది ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా రెండు గ్రాండ్‌స్లామ్ సహా తొమ్మిది టైటిళ్లతో పాటు డబ్ల్యుటీఏ చాంపియన్‌షిప్‌ను సైతం దక్కించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో అనుకున్న ఫలితాలు కనిపించకపోవడంతో 16 నెలల తమ భాగస్వామ్యానికి వీరు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి సానియా చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ బార్బోరా స్ట్రికోవాతో...  హింగిస్ అమెరికాకు చెందిన కోకో వాండెవేగ్‌తో కలిసి బరిలోకి దిగనున్నారు.

2015 మార్చిలో సానియా, హింగిస్ జతకట్టారు. ‘హింగిస్‌తో సానియా భాగస్వామ్యం ముగిసింది. గత ఐదు నెలలుగా ఈ జోడి అనుకున్నంతగా రాణించలేకపోతోంది. టాప్-100కు పైగా ర్యాంకింగ్స్ కలిగిన ఆటగాళ్ల చేతిలోనూ ఓడిపోతున్నారు. అందుకే విజయాలు రానప్పుడు భాగస్వామిని మార్చుకోవడం అనివార్యం’ అని సానియా సన్నిహిత వర్గాలు తెలిపాయి. చివరిసారిగా ఈ జోడి గత నెలలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్‌లో పాల్గొని క్వార్టర్స్‌లో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు