హింగిస్పై సానియా పైచేయి!

22 Aug, 2016 12:41 IST|Sakshi
హింగిస్పై సానియా పైచేయి!

సిన్సినాటి: నిన్న, మొన్నటి వరకూ సానియా మీర్జా(భారత్)-మార్జినా హింగిస్(స్విట్జర్లాండ్)లు 'సాన్టినా'గా జోడిగా మనకు సుపరిచితమే. అయితే  ఈ జోడీకి కటీఫ్ చెప్పుకున్న అనంతరం జరిగిన తొలి పోరులో  మార్టినా హింగిస్పై సానియా మీర్జా పైచేయి సాధించింది. సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా - బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్) ద్వయం 7-5, 6-4 తేడాతో మార్టినా హింగిస్-కోకో వాండెవేగ్‌(అమెరికా)పై విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకున్నారు. దీంతో డబ్యూటీఏ డబుల్స్లో సానియా ఒంటిరిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

గతేడాది మార్చిలోసానియా-హింగిస్లు  'సాన్టినా'గా జత కట్టారు. అనంతరం ఈ జోడీ అప్రతిహత విజయాలతో దూసుకుపోయింది. వరుసగా 41 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని ఈ జోడి .. ఓవరాల్ గా 14 టైటిల్స్ను సొంతం చేసుకుంది. ఇందులో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2015 వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకున్న సాన్టినాలు.. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సైతం కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా గతేడాది తొమ్మిది టైటిల్స్ ఈ జోడి ఖాతాలో చేరాయి. దాంతో పాటు చార్లెస్టన్ టైటిల్ ను గెలిచిన అనంతరం వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది.  అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ ఘోరంగా విఫలం కావడంతో తమ టెన్నిస్ బంధానికి కటీఫ్ చెప్పుకున్నారు.

మరిన్ని వార్తలు