సెమీస్‌లో సానియా జంట

10 Apr, 2017 12:58 IST|Sakshi
సెమీస్‌లో సానియా జంట

సిడ్నీ: ఏడాదిన్నర తర్వాత తన పాత భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సిడ్నీ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-బెథానీ ద్వయం 6-3, 6-3తో రెండో సీడ్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై సంచలన విజయం సాధించింది.

చివరిసారి 2013 ఫ్రెంచ్ ఓపెన్‌లో బెథానీతో కలిసి ఆడిన సానియా ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో కిమికో డాటె క్రుమ్ (జపాన్)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది.
 
బోపన్న జోడీ కూడా: ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్) నెస్టర్ (కెనడా) జంట కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ 7-5, 6-3తో బొలెలీ-ఫాగ్‌నిని (ఇటలీ)లపై గెలిచారు. సెమీఫైనల్లో టాప్ సీడ్ జూలియన్ బెనెట్యూ-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటతో బోపన్న జోడీ ఆడుతుంది.

మరిన్ని వార్తలు