ఓడితే భోజనం చేయకూడదా: సానియా మీర్జా 

16 Jun, 2019 10:32 IST|Sakshi
సానియా మీర్జా 

లండన్‌ : భారత టెన్నిస్‌ స్టార్, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ భార్య సానియా మీర్జా ఎక్కడికి వెళ్లినా మీడియా వెంటాడటం, ఆమె అసహనం వ్యక్తం చేయడం చాలా సార్లు జరిగేదే. మాంచెస్టర్‌లో శనివారం భర్త షోయబ్‌ మాలిక్‌తో కలిసి ఆమె బయటకు వెళ్లింది. వారితో పాటు పాక్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హఖ్‌ కూడా ఉన్నాడు. దీనిని వీడియో తీసిన పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు ‘కీలక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ మానేసి షోయబ్‌ మాలిక్‌ షికార్లు’ అని టీవీలో వార్త ప్రసారం చేశాడు. దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి ట్విట్టర్‌లో తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. 

‘మా ఏకాంతాన్ని గౌరవించకుండా, మాతో పసివాడు ఉన్నాడనే విషయాన్ని మరచి మా అనుమతి లేకుండా వద్దంటున్నా ఆ వీడియో తీయడమే తప్పయితే దానికో చెత్త కథనం జోడించావు. మేం వెళ్లింది షికారుకు కాదు. అయినా మ్యాచ్‌ ఓడినా సరే భోజనం చేసే అర్హత అందరికీ ఉంటుంది. అంతా మూర్ఖుల బృందం’ అని శివాలెత్తింది. ఇక భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నేథ్యంలో ఇరు దేశాల మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై కూడా సానియా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను కించపరుస్తూ రూపొందించిన వీడియోను ఉద్దేశిస్తూ మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని సానియా చివాట్లు పెట్టింది. (చదవండి: ఆ ప్రకటనలపై సానియా ఫైర్‌)

>
మరిన్ని వార్తలు