ఎందుకీ మతిలేని ప్రకటనలు: సానియా

13 Jun, 2019 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌పై అంచనాలను పెంచేందుకు ప్రసారమవుతున్న టీవీ ప్రకటనలపై హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అసంతృప్తి వెలిబుచ్చింది. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని వారించింది. పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ భార్య అయిన సానియా ఈ యాడ్‌లపై స్పందిస్తూ ‘సరిహద్దుకు అవతల, ఇవతల వస్తున్న ఈ ప్రకటనలు చిరాకు తెప్పిస్తున్నాయి. మీరేమీ అంచనాలు పెంచక్కర్లేదు... మార్కెటింగ్‌ చేయాల్సిన అవసరం లేదు.

ఇంతటితో దీన్ని మానుకోండి. ఇది కేవలం క్రికెట్‌ మ్యాచే. ఇంతకు మించి మీరు ఎక్కువ ఊహించుకోకండి’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీలో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ వేషధారణలో ఉన్న వ్యక్తితో భారత వ్యూహాలపై వ్యంగ్యమైన ప్రకటన పదేపదే ప్రసారమవుతోంది. ఆ యాడ్‌లో పాక్‌ వర్గాలు మీ ఎత్తుగడలేంటని అడిగితే ఆ వ్యక్తి ‘క్షమించాలి. నేను ఆ విషయాలు చెప్పదల్చుకోలేదు’ అని అంటాడు. భారత్‌లోని స్టార్‌ టీవీలో పాక్‌పై ప్రపంచకప్‌లో భారత్‌ ఆధిపత్యంపై కూడా ఓ వాణిజ్య ప్రకటన ప్రసారమవుతోంది. 


 

మరిన్ని వార్తలు