సానియాకే పగ్గాలు

15 Mar, 2015 01:05 IST|Sakshi
సానియాకే పగ్గాలు

ఫెడరేషన్ కప్
 

న్యూఢిల్లీ: ఫెడరేషన్ కప్ గ్రూప్-2 ఆసియా, ఓసియానియా టోర్నీలో భారత జట్టు ప్లేయింగ్ కెప్టెన్‌గా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఎంపికైంది. వచ్చే నెల 14 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో జరిగే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి గ్రూప్-1లో చోటు దక్కించుకోవాలని జట్టు భావిస్తోంది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ఎంపిక చేసింది.

నలుగురు సభ్యులతో కూడిన జట్టులో సానియాతో పాటు అంకిత రైనా, ప్రార్థన తొంబరే, నటాషా పల్హా ఉన్నారు. రిజర్వ్ క్రీడాకారిణులుగా తెలుగు అమ్మాయిలు రిషిక సుంకర, నిధి చిలుముల... జాతీయ జూనియర్ చాంపియన్ కర్మాన్ కౌర్ ఉన్నారు. జట్టు అవకాశాలను మెరుగుపరిచేందుకు సానియా సింగిల్స్‌లోనూ బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు ‘ఐటా’ తెలిపింది. టోర్నీకి పది రోజుల ముందే జట్టు సభ్యులు సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు