సంజన డబుల్‌ ధమాకా

17 Mar, 2019 10:08 IST|Sakshi

‘ఐటా’ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–16, అండర్‌–18 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోని కర్నల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న రెండు వయో విభాగాల్లోనూ విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్‌–16 బాలికల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచిన సంజన... అండర్‌–18 కేటగిరీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ అండర్‌–18 డబుల్స్‌ కేటగిరీలో తన భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన అండర్‌–16 బాలికల టైటిల్‌పోరులో సంజన 6–4, 7–5తో రాధిక రాజేశ్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సంజన 6–2, 6–1తో నియతి (ఉత్తరాఖండ్‌)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–0తో క్రిస్టీ బోరో (అస్సాం)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–0, 6–0తో వన్య అరోరా (మహారాష్ట్ర)పై, తొలి రౌండ్‌లో 6–1, 6–3తో అనా వర్షిణి (ఉత్తర్‌ప్రదేశ్‌)పై విజయం సాధించింది.  

సింగిల్స్‌ ఓడినా.. డబుల్స్‌ దక్కింది

అండర్‌–16 విభాగంలో ఆధిపత్యం ప్రదర్శించిన సంజన... అండర్‌–18 కేటగిరీ సింగిల్స్‌లో చివరి మెట్టుపై తడబడింది. ఫైనల్లో సంజన 4–6, 3–6తో గార్గి (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో సంజన 6–4, 1–6, 6–1తో కశిష్‌ భాటియా (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–1, 5–7, 6–4తో హర్లీన్‌ కౌర్‌ (పంజాబ్‌)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–2తో క్రితిక (హరియాణా)పై, తొలి రౌండ్‌లో 6–1, 6–1తో ఐరా సూద్‌ (తెలంగాణ)పై గెలుపొంది ంది. మరోవైపు డబుల్స్‌ విభాగంలో భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి సంజన టైటిల్‌ను సాధించింది. అండర్‌–18 బాలికల డబుల్స్‌ తుదిపోరులో సంజన–ఆర్నిరెడ్డి ద్వయం 7–6, 6–4తో పవిత్రా రెడ్డి జోడీపై విజయం సాధించింది.

మరిన్ని వార్తలు