జడేజా బ్యాటింగ్‌పై మంజ్రేకర్‌ స్పందన

11 Jul, 2019 14:27 IST|Sakshi

మాంచెస్టర్‌: గత కొన్నిరోజులుగా టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాకు, మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌కు మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘జడేజా ఒక స్మార్ట్‌ గల్లీ క్రికెటర్‌ అని, అడపా దడపా ఆడే జడేజా లాంటి క్రికెటర్లకు నేను అభిమానిని కాదు’ అని మంజ్రేకర్‌ పేర్కొనగా దానికి జడేజా ఘాటుగానే బదులిచ్చాడు. ‘ నీ కంటే రెండింతలు ఎక్కువ క్రికెట్‌ ఆడాను. ఇంకా ఆడుతున్నా. ఇతరులను గౌరవంచడం నేర్చుకో’ అంటూ చురకలంటించాడు.

అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో జడేజా అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. టీమిండియాకు ఘోర ఓటమి తప్పదనుకున్న తరుణంలో జడేజా బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవకపోయినా పోరాట స్ఫూర్తి ఆకట్టుకుంది. అది కూడా జడేజా-ధోనిల 116 పరుగుల భాగస్వామ్యం కారణంగా భారత్‌ గెలుపు అంచుల వరకూ వచ్చింది.

దీనిపై తాజాగా మంజ్రేకర్‌ స్పందిస్తూ.. అద్భుతమైన బ్యాటింగ్‌తో తన వ్యాఖ్యలు తప్పని జడేజా నిరూపించడన్నాడు. కివీస్‌తో జరిగిన కీలక పోరులో బాగా ఆడాడని మ్యాచ్‌ అనంతరం మెచ్చుకున్నాడు. గత 40 ఇన్నింగ్స్‌లలో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమేనని, ఇదివరకెన్నడూ ఇలాంటి జడేజాని చూడలేదని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణించి అందరి చేతా జడ్డు ప్రశంసలు అందుకున్నాడని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు