అలా అయితే భువనేశ్వర్‌పైనే వేటు!

27 May, 2019 11:25 IST|Sakshi

లండన్‌ : జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే సన్నాహక సమరాన్ని పరాజయంతో ప్రారంభించిన కోహ్లిసేన.. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచకప్‌లో పేసర్ల పాత్ర కీలకం కానుంది. అయితే భారత్‌ జట్టులో ముగ్గురు పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ,భువనేశ్వర్‌ కుమార్‌లతో పాటు ఆలౌరౌండర్‌ పేసర్‌ హార్దిక్‌ పాండ్యా ఉన్నాడు.

గత రెండేళ్లుగా ఓవర్సీస్‌లో అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌-చహల్‌ స్పిన్‌ ద్వయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడించాలని భావిస్తే అప్పుడు ఏ పేసర్‌ను పక్కన పెడ్తారనే చర్చ ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో జోరు అందుకుంది. అలాంటి పరిస్థితే ఏర్పడితే వేటు భువనేశ్వర్‌పైనే పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. బుమ్రా కీలక బౌలర్‌ కావడం, షమీ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండటం.. పాండ్యా ఆల్‌రౌండర్‌ కావడంతో భువనేశ్వర్‌పైనే వేటు పడే అవకాశం ఉందన్నాడు. పైగా భువనేశ్వర్‌కు 50 ఓవర్ల ఫార్మాట్‌లో అంత మంచి రికార్డు లేదని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు