బీజేపీలోకి ధోని : కేంద్ర మాజీమంత్రి

13 Jul, 2019 12:05 IST|Sakshi
ధోని, అమిత్‌ షా (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో భారత్‌ కథ సెమీస్‌తో ముగియడంతో ఇప్పుడు చర్చంతా సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భవిష్యత్పైనే జరుగుతోంది. ధోని రిటైర్మెంట్‌ తీసుకుంటాడనే ప్రచారం జోరందుకుంది. అయితే రిటైర్మెంట్‌ అనంతరం ధోని బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధోని త్వరలోనే నరేంద్రమోదీ టీమ్‌లో పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం ఉందన్నారు.

ధోని బీజేపీలో చేరేలా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ‘ధోని నా స్నేహితుడు. అతనొక ప్రపంచ దిగ్గజ ఆటగాడు. అతన్ని బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయితే అతని రిటైర్మెంట్‌ అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.’  అని పాస్వాన్‌ పేర్కొన్నారు. ఇక ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది. 

మరిన్ని వార్తలు