సంజీవ్‌కు రజతం 

30 Aug, 2019 06:56 IST|Sakshi

షూటింగ్‌లో భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ 

రియో డి జనీరో (బ్రెజిల్‌): ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. దాంతోపాటు భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను అందించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో సంజీవ్‌ 462 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. పీటర్‌ గోర్సా (క్రొయేషియా-462.2 పాయింట్లు) స్వర్ణం, జాంగ్‌ చాంగ్‌హాంగ్‌ (చైనా-449.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఆఖరి షాట్‌ వరకు పాయింట్‌ ఆధిక్యంలో ఉండి పసిడి రేసులో నిలిచిన సంజీవ్‌ చివరి షాట్‌లో 8.8 పాయింట్ల షాట్‌ కొట్టి మూల్యం చెల్లించుకున్నాడు. పీటర్‌ గోర్సా చివరి షాట్‌లో 10 పాయింట్ల షాట్‌ కొట్టి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ ఇలవేనిల్‌ వలరివాన్‌ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు అభిషేక్‌ వర్మ, సౌరభ్‌ చౌధరీ ఫైనల్‌కు చేరుకున్నారు.


 

మరిన్ని వార్తలు