సంతోషికి రూ. 7.5 లక్షలు

7 Aug, 2014 01:56 IST|Sakshi
సంతోషికి రూ. 7.5 లక్షలు

 ఏపీ ప్రభుత్వ నజరానా
 విజయనగరంలో ఘన స్వాగతం

 
 సాక్షి, విజయనగరం: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ మత్స్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించనుంది. సంతోషికి రూ. 7.50 లక్షల బహుమతి ఇస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. రామారావు ప్రకటించారు. ఈ నెల 8, 9 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ మొత్తం అందిస్తారు. దీంతో పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటి పట్టా కూడా ఇవ్వనున్నట్లు జేసీ వెల్లడించారు. గ్లాస్గోనుంచి తిరిగి వచ్చిన సంతోషికి బుధవారం విజయనగరంలో ఘన స్వాగతం లభించింది.
 
  పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెను సన్మానించారు. పేదరిక నేపథ్యంనుంచి వచ్చినా...పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంతోషి ఘనతను అంతా ప్రశంసించారు. ‘త్వరలో జరిగే సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నాను. ఆ తర్వాత ఒలింపిక్స్‌లోనూ పతకం నెగ్గడమే నా లక్ష్యం. అందుకు ప్రభుత్వంతో పాటు అందరి సహకారం కావాలి’ అని ఈ సందర్భంగా సంతోషి వ్యాఖ్యానించింది.
 

మరిన్ని వార్తలు