సింగిల్స్‌ కోచ్‌గా సొంటోసో 

29 Feb, 2020 03:29 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ వరకు శిక్షణ 

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ ఏడాది నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన అగుస్‌ డ్వి సాంటోసోను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ జి హ్యూన్‌ వెళ్లడంతో ఏర్పడిన కోచ్‌ ఖాళీని భర్తీ చేయాలంటూ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరింది. దానిపై స్పందించిన మంత్రిత్వ శాఖ సాంటోస్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడు ఒలింపిక్స్‌ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించనున్నాడు. సాంటోస్‌ మార్చి రెండో వారంలో భారత బ్యాడ్మింటన్‌ జట్టుతో కలుస్తాడు. అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధుతో పాటు ఇతర సింగిల్స్‌ షట్లర్లు కూడా టోక్యో కోసం సిద్ధమవుతారు. సాంటోస్‌ శిక్షణతో  సంతృప్తి చెందితే అతడిని 2024 వరకు కూడా కొనసాగిస్తామని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కార్యదర్శి అజయ్‌ సింఘానియా తెలిపారు. ఒలింపిక్స్‌ వరకు సొంటోసోకు నెలకు 8 వేల డాలర్లు (సుమారు రూ.5.8 లక్షలు ) చెల్లించనున్నారు.

మరిన్ని వార్తలు