సర్దార్‌ ఇక హాకీ సెలక్టర్‌...

17 Jan, 2019 10:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌సింగ్‌ ఇక సెలక్టర్‌ పాత్ర పోషించనున్నాడు. 13 మంది సభ్యుల భారత హాకీ సెలక్షన్‌ కమిటీలో సర్దార్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని సర్దార్‌ సింగ్‌ ధ్రువీకరించాడు. ‘భారత హాకీకి ఆటగాడిగానే కాకుండా ఏ రకంగా సేవచేసేందుకైనా నేను సిద్ధం. అందుకే సెలక్టర్‌ పాత్రను పోషించేందుకు కూడా సిద్ధమయ్యాను. సెలక్టర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. రెండు దశాబ్దాలుగా ఆటగాడిగా హాకీ పరిస్థితుల్ని దగ్గరుండి చూశా.

జట్టుకు ఏది ముఖ్యమో అర్థం చేసుకున్నా. అనుభవజ్ఞులు, యువతతో కూడిన సమతూకమైన జట్టుకే నేను మద్దతిస్తా’ అని సర్దార్‌ సింగ్‌ పేర్కొన్నాడు. సర్దార్‌తో పాటు హర్బీందర్‌ సింగ్, సయ్యద్‌ అలీ, సుబ్బయ్య, ఆర్‌పీ సింగ్, రజనీశ్‌ మిశ్రా, జోయ్‌దీప్‌ కౌర్, సురేందర్‌కౌర్, అసుంత లాక్రా, హై పర్ఫామెన్స్‌ డైరైక్టర్‌ డేవిడ్‌ జాన్, భారత సీనియర్‌ పురుషుల, మహిళల జట్ల కోచ్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి 1975 హాకీ ప్రపంచ కప్‌ విజేత జట్టులో సభ్యుడైన బీపీ గోవింద సారథిగా వ్యవహరిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు