సర్దార్‌పై సస్పెన్షన్

2 Aug, 2014 02:01 IST|Sakshi
సర్దార్‌పై సస్పెన్షన్

న్యూజిలాండ్‌తో సెమీస్‌కు దూరం
 గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు ప్రమాదకరమైన ఆటతీరును కనబర్చినందుకు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై ఒక్క మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. దీంతో శనివారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రమాదకరమైన ఆటతీరుతో ఎల్లోకార్డుకు గురైన సర్దార్... దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ దాన్ని పునరావృతం చేశాడు. దీంతో నిర్వాహకులు రెండు మ్యాచ్‌ల పాటు సస్పెన్షన్ విధించారు. అయితే భారత మేనేజ్‌మెంట్ దీనిపై జ్యూరీకి అప్పీలు చేయడంతో శిక్షను ఒక్క మ్యాచ్‌కు పరిమితం చేశారు.
 
 భారత మహిళలకు ఐదో స్థానం
 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. శుక్రవారం 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-1తో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. అనుపా బార్లా (53వ ని.), పూనమ్ రాణి (55వ ని.) టీమిండియా తరఫున ఫీల్డ్ గోల్స్ చేయగా, నిక్కి కిడ్ (57వ ని.) పెనాల్టీ కార్నర్‌తో స్కాట్లాండ్‌కు ఏకైక గోల్ అందించింది.
 

మరిన్ని వార్తలు