సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు!

22 Jun, 2019 09:04 IST|Sakshi
సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగిన అభిమాని

అయినా ప్రశాంతంగా ఉన్న పాక్‌ కెప్టెన్‌

లండన్ ‌: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మరోసారి ఘోర అవమానానికి గురయ్యాడు. ప్రపంచకప్‌లో భారత్‌తో ఓటమిని పాక్‌ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. ‘సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా’  అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్‌ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. నెటిజన్లు ఆ అభిమాని చర్యను తప్పుబడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది’ అంటూ మండిపడుతున్నారు. ఒక ఫ్రొఫెషనల్‌ ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యని ఒకరు.. ‘నీవు చేసే 9-5 ఉద్యోగంలో ఏదో తప్పిదం చేస్తే.. అప్పుడు జనాలంతా రోడ్లపై నిన్ను ఇలానే అవమానపరిస్తే తట్టుకుంటావా? అని మరొకరు ప్రశ్నించారు. తప్పులు సహజమని, ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆహ్వానించదగిన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు.

ఇక భారత్‌తో మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఆవలింతలు తీయడం కూడా అతని ఫిట్‌నెస్‌పై విమర్శలకు కారణమైంది. పిజ్జాలు, బర్గర్లు తినడమే కానీ ఫిట్‌నెస్‌పై ఏమాత్రం సోయిలేదని, ఓటమికి పూర్తి బాధ్యత సర్ఫరాజ్‌దేనని ఆ దేశ అభిమానులు మండిపడ్డారు. ఇక మ్యాచ్‌ అనంతరమే స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని సర్ఫరాజ్‌ శరీరాకృతిపై కామెంట్‌ చేశాడు. ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ అయితే ఏకంగా సర్ఫరాజ్‌కు బుద్ధిలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

చదవండి: మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్‌ ఫైర్‌
మైదానంలోనే పాక్‌ కెప్టెన్‌కు అవమానం!

మరిన్ని వార్తలు