మైదానంలోనే పాక్‌ కెప్టెన్‌కు అవమానం!

19 Jun, 2019 11:51 IST|Sakshi

మాంచెస్టర్‌ : పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌‌ మైదానంలోనే తీవ్ర అవమానానికి గురయ్యాడు. ఆదివారం భారత్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో ఘోర పరజాయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం మైదానంలో కోచ్‌ మిక్కి ఆర్థర్‌తో సర్ఫరాజ్‌ నిలబడగా.. అతన్ని ఉద్దేశించి గ్యాలరీలో ఉన్న అభిమానులు చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. ‘ సర్ఫరాజ్‌ నీకు చాలా కొవ్వెక్కింది. బ్యాటింగ్‌ పిచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకుంటావా? మన దేశ ప్రధాని మాట వినవా? అంటూ అరవసాగారు. ఈ మాటలు విని వారివైపు చూసిన సర్ఫరాజ్‌.. స్వయంకృత అపరాధంగా భావించి నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇక ఏ మాత్రం అంచనాలు లేని పాక్‌ జట్టు గతేడాది సంచలన విజయాలు నమోదు చేసి చాంపియన్స్‌ ట్రోఫి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్లనంతరం జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీలో ఆ జట్టు హాట్‌ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఆ దేశ అభిమానులు కూడా తమ జట్టు కప్‌ గెలుస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఘోర పరాజయంతో మొదలు పెట్టిన పాక్‌.. మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించంది. దీంతో గాడిలో పడినట్లు కనిపించిన పాక్‌ అనంతరం ఆస్ట్రేలియాతో ఓడింది. తర్వాత ప్రతిష్టాత్మకంగా భావించిన భారత్‌తో జరిగన మ్యాచ్‌లో ఏ మాత్రం పోరాట పటిమ కనబర్చకుండా చేతులెత్తేసింది. ఈ ఓటమిని పాక్‌ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా స్వయంకృ అపరాధంగానే ఈ మ్యాచ్‌ ఓడిపోయామని, టాస్‌ గెలిచిన సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ తీసుకోకుండా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడని, దీంతో తమ జట్టు ఓడిపోయిందనే భావనలో ఉన్నారు. దీంతో అతనిపై వ్యక్తిగతంగా మాటల దాడికి దిగారు. అభిమానులేకాక పాక్‌ మాజీ క్రికెటర్లు సైతం సర్ఫరాజ్‌ను ఘాటుగా మందలిస్తున్నారు. షోయబ్‌ అక్తర్‌ అయితే సర్ఫరాజ్‌కు ఏమాత్రం బుద్దిలేదన్నాడు. ఏది ఏమైనప్పటికి ఒక ఆటగాడిపై వ్యక్తిగతంగా మాటలదాడి చేయడం, అతని శరీర ఆకృతిని ప్రస్తావిస్తూ తిట్టడం సరైంది కాదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: కోహ్లినిస్తే.. కశ్మీర్‌ అడగం : పాక్‌ అభిమానులు
మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్‌ ఫైర్‌
‘సర్ఫరాజ్‌ స్లీప్‌ ఫీల్డర్‌’

మరిన్ని వార్తలు