ధోనిని కలిసింది ఒక్కసారే.. కానీ

29 Jun, 2018 12:29 IST|Sakshi

కరాచీ: తనకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనినే స్ఫూర్తి అంటున్నాడు పాకిస్తాన్‌ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.  పాకిస్తాన్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు బయల్దేరే క‍్రమంలో గురువారం మీడియాతో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ఎంఎస్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఎంఎస్‌ను కలిసింది ఒక్కసారే అయినా.. అతని నాయకత్వ లక్షణాలు, ఆటతీరు తనని ఆకట్టుకున్నాయని పాక్ కెప్టెన్ వెల్లడించాడు. గత ఏడాది పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ పటిమతో జట్టుకి అద్వితీయమైన విజయాల్ని అందించాడు. దీంతో.. మూడు ఫార్మాట్లలోనూ అతడికి కెప్టెన్సీ బాధ్యతలను పీసీబీ కట్టబెట్టింది.

‘ ఎంఎస్‌ ధోని తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా పనిచేశాడు. నాయకుడిగా అతనే నాకు స్ఫూర్తి.  భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య 2017, జూన్ 4న జరిగిన మ్యాచ్‌లో భాగంగా ధోనిని తొలిసారి కలిశాను. ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా అతని నుంచి నేను చాలా నేర్చుకున్నా. అతనే నాకు స్ఫూర్తి’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. గత ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టుని పాకిస్తాన్ ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు