సౌరభ్, రాహీ డబుల్‌ ధమాకా

28 May, 2019 05:39 IST|Sakshi
సౌరభ్‌ చౌధరీ, రాహీ సర్నోబత్‌

ప్రపంచ రికార్డులతో పసిడి పతకం

స్వర్ణం సహా ఒలింపిక్‌ బెర్త్‌ సొంతం

మ్యూనిక్‌ (జర్మనీ): భారత షూటర్లు మళ్లీ బంగారు గురితో భళా అనిపించారు. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో రెండో రోజు భారత్‌కు సౌరభ్‌ చౌధరీ, రాహీ సర్నోబత్‌ రెండు స్వర్ణాలను అందించారు. ఈ క్రమంలో సౌరభ్‌ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్‌ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్‌ బెర్త్‌లను సాధించడం విశేషం.

సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో సౌరభ్‌ చౌధరీ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్‌ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన షాజర్‌ రిజ్వీ 177.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో సౌరభ్‌ 586 పాయింట్లు, షాజర్‌ రిజ్వీ 583 పాయింట్లు సాధించి వరుసగా రెండు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.  

మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్‌ రాహీ సర్నోబత్‌ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్‌ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో రాహీ 586 పాయింట్లు, మను 585 పాయింట్లు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు.   

మరిన్ని వార్తలు