ఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా నాల్గో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసినా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పలు పొరపాట్లు చేసి మ్యాచ్ చేజార్చుకోవడానికి కారణమయ్యాడు. ఆస్టన్ టర్నర్ను రెండు సార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా రిషభ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రధానంగా ఒక స్టంపింగ్ విషయంలో ధోనిని అనుకరించి విఫలం కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీనిపై కోహ్లి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
(ఇక్కడ చదవండి: నో డౌట్.. ఆ జట్టే ఐపీఎల్ విజేత)
ఇది జరిగి చాలా రోజులే అయినప్పటికీ పంత్ మాత్రం ఆ జ్ఞాపకాల్ని ఇంకా బయటపడ్డట్టు కనిపించడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్న రిషభ్ పంత్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోపం అంటే తనకు చాలా భయమని చెప్పుకొచ్చాడు. ‘ నేను సాధారణంగా ఎవ్వరికీ భయపడను. కానీ కోహ్లి భయ్యా కోపం అంటే నాకు చాలా భయం. మనం జట్టులో ఉండి తప్పులు చేస్తున్నప్పుడు ఏ కెప్టెన్కైనా కోపం రావడం సహజం. ఒకవేళ మనం తప్పులు చేయకపోతే ఎవ్వరికీ కోపం ఉండదు కదా. నీకు అప్పగించిన పనిని సరైన రీతిలో చేసినప్పడు అతనికి(కోహ్లి)కి కూడా కోపం రాదు కదా. మనం పొరపాటు చేసిన సమయంలో ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే అప్పడు మనలో మరింత పట్టుదల పెరుగుతుంది. మనం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. మనం పొరపాటు చేసినప్పుడు ఎవరైనా కోపగించుకుంటే అది మంచికే అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని పంత్ పేర్కొన్నాడు.