ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు

26 Aug, 2015 01:44 IST|Sakshi

ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారం
 
 న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు ‘స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్’ విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో ఎస్‌సీఎఫ్ శిక్షణ ఇస్తూ అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు కోసం ఎంపిక చేసిన ఐదుగురి పేర్లను క్రీడాశాఖ ఆమోదించింది.

రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్, పారాలింపిక్స్ కోచ్ నావల్ సింగ్‌ల పేర్లను ప్రస్తుత ప్రదర్శన (2011-2014) ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేయగా జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో నిహర్ అమీన్ (స్విమ్మింగ్), ఎస్‌ఆర్ సింగ్ (బాక్సింగ్), హర్బన్స్ సింగ్ (అథ్లెటిక్స్)లకు దక్కనుంది. వీరికి తలా రూ.5 లక్షల నగదు, ప్రతిమను అందిస్తారు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సత్యవర్త్ కడియన్, బజరంగ్, అమిత దహియాలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడంలో కోచ్ అనూప్ కుమార్ పాత్ర ఉంది. ధ్యాన్‌చంద్ అవార్డు కోసం రోమియో జేమ్స్ (హాకీ), ఎస్‌పీ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్) పేర్లను ఖరారు చేశారు. 

మరిన్ని వార్తలు